జన్‌ధన్ ఖాతా నుంచి రూ. 500 తీసుకుందామని వెళ్లి.. అరెస్టయిన మహిళలు!

  • మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఘటన
  • భౌతిక దూరం పాటించలేదని అరెస్ట్ చేసిన పోలీసులు
  • అందరినీ ఒకే వ్యానులో ఎక్కించి సామాజిక దూరం నిబంధనకు నీళ్లు

లాక్‌డౌన్ నేపథ్యంలో జన్‌ధన్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిన రూ. 500 తీసుకునేందుకు వెళ్లిన మహిళలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో జరిగింది. ప్రభుత్వం జమ చేసిన రూ. 500 తీసుకునేందుకు వెళ్లిన మహిళలు బ్యాంకు బయట క్యూ కట్టారు. 

విషయం తెలిసిన పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని భౌతిక దూరం పాటించాలని కోరారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో 39 మంది మహిళలను అదుపులోకి తీసుకుని జీపెక్కించారు. మహిళలకు సామాజిక దూరం పాఠాలు చెప్పిన పోలీసులు మాత్రం అందరినీ ఒకే జీపులోకి ఎక్కించి భౌతిక దూరం పాటించాలన్న విషయాన్ని మరిచారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది.

మహిళలపై సెక్షన్ 151 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అందరినీ జైలుకి తరలించారు. విషయం తెలిసిన వారి భర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. రూ. 10 వేల చొప్పున జరిమానా చెల్లించి బెయిలు తీసుకున్నారు. నాలుగు గంటల తర్వాత మహిళలు జైలు నుంచి విడుదలయ్యారు.  


Madhya Pradesh
Social Distancing
Corona Virus
women

More Telugu News